ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం సోమ్నాథ్, అంబాజీ ఆలయాల అర కిలోమీటరు పరిధిలోని ప్రాంతాన్ని శాకాహార జోన్గా ప్రకటిస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సౌరాష్ట్రలోని సోమ్నాథ్, ఉత్తర గుజరాత్లో అంబాజీ ఆలయాలను హిందువులకు ప్రముఖ పుణ్యక్షేత్రాలు. ఈ ఆలయాల సమీపంలో 500 మీటర్ల పరిధిలోని మాంసాహార అమ్మకాలను నిషేధిస్తున్నట్టు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ శుక్రవారం ప్రకటించారు. బనస్కాంత జిల్లాలోని పలన్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ రూపానీ ఈ నిర్ణయం వెలువరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమ్నాథ్, అంబాజీ ఆలయాల 500 మీటర్ల పరిధిలో మాంసాహార విక్రయించరాదని, ఈ ప్రాంతాల్లో పూర్తి నిషేధిస్తున్నట్టు తెలిపారు. మాంసాహరం అమ్మకాలను నిషేధించాలని అనేక ఏళ్లుగా పలు హిందూ సంస్థలు, ఈ ఆలయాల పరిసరాల్లోని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వ తాజా నిర్ణయంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, గిర్ జిల్లాలోని సోమ్నాథ్ ఆలయానికి చారిత్రకంగా ఎంతో విశిష్టత ఉంది.
0 Comments